మోడీ నాయకత్వంలో దేశమంతా డిజిటలైజేషన్ మంత్రం జపిస్తుంటే మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.  రోజువారీ కార్యక్రమాలను అధికారిక వెబ్ సైట్ లో కనిపించే పరిస్థితి లేదు. ఉదాహరణకు www.mahabubnagar.nic.in అనే వెబ్ సైట్ చూస్తే ఎప్పుడో సంవత్సరం క్రితం విషయాలే సైట్ పై దర్శనమిస్తాయి. వెబ్ సైట్ లో కనిపించే టెలిఫోన్ నంబర్స్, అధికారుల ఈ మెయిల్ ఐడీలు ఎక్స్ పైర్ అయ్యాయి లేదా పనిచేయడం లేదు.

ఇదంతా జెడ్పీటీసీ సమావేశం సందర్భంగా బయట పడ్డాయి. మూడు నెలలకోసారి జరిగే జడ్పీటీసీ సమావేశంలో కలెక్టర్ తోపాటు మంత్రులు,ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొంటారు. ఇందులో జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలపై సమీక్ష జరుగుతుంది. మొత్తం 64 డిపార్ట్ మెంట్లలో 16 విభాగాలు వారి శాఖలకు సంబంధించి నివేదిక సమర్పించడంలో విఫలమవడంతో పౌరుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. వెబ్ సైట్ సంగతి అలా ఉంచితే తమకు సరైన సమాచారం అధికారులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే అవినీతి పెరిగిపోతోందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. దీంతో పారదర్శకత, జవాబుదారీతనం కనిపించడంలేదని పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో పౌరసమాచార  సంస్థ అట్టర్ ఫెయిల్యూర్ అని చెబుతున్నారు జిల్లావాసులు. ఒక్క పోలీస్ డిపార్ట్ మెంట్ మినహాయిస్తే వైద్యశాఖ, విద్యుత్ శాఖ,మున్సిపాలిటీ శాఖ, పీడబ్ల్యూడీ శాఖలు ప్రజలకు అందుబాటులో లేవని సామాన్య ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ అధికారులకు సీయూజీ కనెక్షన్లు ఉన్నా ఫోన్ ఎత్తరని చెప్తున్నారు.

కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే  గ్రీవెన్స్ సెల్ మీటింగ్ కు  కీలకశాఖల అధికారులు డుమ్మా కొడుతున్నారని జడ్పీటీసీ మెంబర్ హరిప్రసాద్ అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ సెల్ మీటింగ్ కు ఎంతమంది అధికారులు హాజరయ్యారో తెలపాల్సిందిగా హరిప్రసాద్ ఆర్టీఐ ఫైల్ చేయగా అస్సలు ఒక్క అధికారి కూడా పాల్గొనలేదని తెలియడంతో విస్మయానికి గురైనట్లు ఆయన చెప్పారు.

చాలామంది అధికారులు పనివేళలను పాటించడంలేదని మండిపడ్డారు. ఉదయం 11 గంటలకు వస్తున్న అధికారులు ఒంటిగంట వరకు కాలయాపన చేసి భోజనానికి వెళ్తున్నారని విమర్శించారు. తిరిగి 2 గంటలకు వచ్చి అరొకొర పనిచేసి 4:30 గంటలకు బయటపడుతున్నారని హరిప్రాసద్ తెలిపారు.

ఇప్పటికైనా డిపార్ట్ మెంట్ అధికారులు తమ వెబ్ సైట్లను అప్ డేట్ చేసి నెలవారీగా రిపోర్ట్ తయారు చేసి సైట్ లో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాదు సరైన అడ్రస్ తో సంబంధిత ఆఫీస్ ఎక్కడుందో … ఆ ఆఫీస్ అధికారి పేరు ఫోన్ నంబర్ తో సహా అన్ని వెబ్ సైట్ లో ఉంచాలని పాలమూరువాసులు డిమాండ్ చేస్తున్నారు.

దేవుడు కరుణించినా పూజారి కరుణించడు అన్నట్లు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినా అధికారులు మాత్రం మొద్దు నిద్రను వీడటం లేదు. ప్రభుత్వం సహకారం అందించినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top