ముంబయి : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 11న జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... బాలిక ఏప్రిల్‌ 10న తన స్నేహితుడు దీపక్‌ కోక్నేతో కలసి గేట్‌వే ఆఫ్‌ ఇండియాను చూసేందుకు వెళ్లింది. ఆ రోజు రాత్రి 7గంటల సమయంలో వారు ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగుముఖం పట్టారు. అతడి వాహనంలో పెట్రోల్‌ అయిపోవడంతో మహుల్‌గాన్‌ ప్రాంతంలో ఆమెను వదిలిపెట్టి ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పాడు.

అక్కడి నుంచి ఇంటికి చేరుకునేందుకు ఆమెకు దారి తెలియలేదు. దీంతో రోడ్డుపై వెళుతున్న ప్రేమ్‌ అనే వ్యక్తిని ఆమె దారి అడిగింది. తనతోపాటు వస్తే దారి చూపిస్తానని అతడు చెప్పాడు. అందుకు ఆమె సంశయించడంతో భయపడనక్కర్లేదని, తనకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని ఓ ఫొటో చూపించాడు. ధైర్యంగా తనతో రమ్మని చెప్పాడు. దీంతో ద్విచక్రవాహనంపై అతడితో వెళ్లేందుకు బాలిక సిద్ధపడింది. ఆమెను అర్థరాత్రి వరకూ బండిమీద తిప్పి చివరికి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడున్న టెంపోలో ఆమెపై అత్యాచారం చేశాడు.

ఇంతలో బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక రోడ్డుపై తిరుగాడుతున్న ఆమెను ఏప్రిల్‌ 12న పెట్రోలింగ్‌ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తర్వాత ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే భయంతో వున్న బాలిక అత్యాచారం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ఆమె స్టేట్‌మెంట్‌ నమోదు చేసేందుకు పోలీసులు ఆమెతో మాట్లాడారు. అప్పుడు ఆమె జరిగినదంతా ఏడుస్తూ తమకు చెప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top